నేటి నుంచే ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్

  • 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఈరోజే ప్రారంభం
  • నాటింగ్ హామ్ లో తొలి మ్యాచ్
  • ఇంగ్లండ్ జట్టుకు దూరమైన బెన్ స్టోక్స్, ఆర్చర్
మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు రెడీ అయింది. ఈరోజు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ నాటింగ్ హామ్ లో జరగనుంది. ఈ ఏడాది భారత పర్యటనలో 3-1 తేడాతో సిరీస్ ను ఇంగ్లండ్ కోల్పోయింది. ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. అయితే తొలి మ్యాచ్ కు కీలక ఆటగాళ్లు బెన్ స్టోక్స్, ఆర్చర్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని చెప్పుకోవాలి.

టీమిండియా విషయానికి వస్తే... తుదిజట్టు ఎంపిక కష్టంగా మారింది. రోహిత్ శర్మకు తోడుగా ఓపెనింగ్ ఎవరు చేస్తారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. కేఎల్ రాహుల్, హనుమ విహారి, కొత్త ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ లలో ఒకరు ఓపెనింగ్ కు వచ్చే అవకాశం ఉంది. పుజారా, కోహ్లీ, రహానే, పంత్ లతో మిడిలార్డర్ బలంగానే ఉంది. అశ్విన్, జడేజాలలో ఒకరికి అవకాశం రావచ్చు. పేస్ విభాగంలో షమి, బుమ్రా, ఇషాంత్ లు ఉండే అవకాశం ఉంది. సిరాజ్ కు చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 122 టెస్టులు జరగ్గా... 29 మ్యాచుల్లో ఇండియా, 48 మ్యాచుల్లో ఇంగ్లండ్ గెలుపొందాయి.

Team India
England
Test Series

More Telugu News